ఎర్రవల్లి: ఇటిక్యాల మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జాతీయ జెండాను అధికారులు తలకిందులుగా ఎగురవేశారు. దీంతో కాషాయం రంగు కింద, ఆకుపచ్చ రంగు పైకి ఉండటాన్ని గమనించిన పలువురు విస్మయం వ్యక్తం చేశారు. విషయం గుర్తించిన వెంటనే జెండాను దించి, సరైన క్రమంలో తిరిగి ఎగురవేశారు. జాతీయ పతాకం విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉండగా నిర్లక్ష్యం ఎలా జరిగిందని స్థానికులు విమర్శించారు. దీనిపై ఏపీఎం పద్మ వివరణ ఇస్తూ.. జెండా ఆవిష్కరణ సమయంలో రెండు తాళ్లను ఒకేసారి లాగడంతో పొరపాటు జరిగిందని, వెంటనే గుర్తించి సరిచేసినట్లు తెలిపారు.


