జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ చౌరస్తాలో సీపీఐ జన చైతన్య పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం, రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన మద్దతు, కార్మిక హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై సీపీఐ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువల పునరుద్ధరణ కోసం సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీపీఐ ఆధ్వర్యంలో మహా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలను పెద్ద ఎత్తున సమీకరిస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనరసింహ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి బాలకిషన్, నాయకులు పరమేశ్ గౌడ్, సురేష్, రాము, కృష్ణ యాదవ్, గోవర్ధన్, అల్వాల్ రెడ్డి, శంకర్ నాయక్, భాష, మహేష్, సత్యనారాయణ రెడ్డి, భార్గవి, ఆంజనేయులు, ఇందిర, సువర్ణ, జంగయ్య, దేవానందు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, శ్రీను, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు


