అలంపూర్: దుక్కిలోనే అడుగు మందులు(ఎరువులు) వేసుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి నాగార్జున్రెడ్డి, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నేల భూసారాన్ని బట్టి ఈ ప్రాంతంలో డీఏపీ, కాంప్లెక్స్, సింగల్ సూపర్ ఫాస్పట్ వంటి మందులు దుక్కిలో వేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ మందులు పైపాటుగా వేస్తే ప్రయోజనం పొందకపోగా పెట్టుబడి వ్యయం పెరుగుతందని పేర్కొన్నారు. అందుకే ఎరువుల సమతుల్యత పాటిస్తూ దుక్కిలో వేయాలని, యూరియా, పొటాష్ వంటి మందులు పైరు అవసరం మేరకు పైపాటుగా వేసుకోవాలని వివరించారు. వానకాలం పంట సాగు సీజన్లో రైతులు వాడాల్సిన ఆయా రకాల ఎరువులు, వాడాల్సిన మోతాదుపై సూచనలు, సలహాలు అందించారు.
మోతాదుకు మించి డీఏపీ:
ఈ ప్రాంత నేలల్లో భాస్వరం మధ్యస్తంగా, పొటా షియం ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నేల స్వభావాన్ని బట్టి పంట కాలంలో ఎకరానికి 50 కేజీల డీఏపీ వాడాలి. కానీ రైతులు ఎకరానికి 100 నుంచి 150 కేజీల వరకు వేస్తున్నారు. పైరుకు వేయాల్సిన దాని కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు ఈ మందును పైపాటుగా వేస్తునందున ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని పేర్కొన్నారు.
వాడే మోతాదు : భూమి సారాన్ని బట్టి వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఎరువుల మోతాదు సూచిస్తున్నారు.. డీఏపీ ఎరువును ప్రతి ఎకరాకు 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పనిసరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందున ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగకరంగా ఉండదు. పత్తి పంటకు విత్తు కంటే మూడు నుంచి నాలుగు అంగుళాల లోతులో వేయాలి. మిగిలిన అన్ని వానాకాలం పంటలకు ఎకరాకు 50 కేజీలు వాడాలి. యూరియా ప్రతి ఎకరాకు వంద కిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందున యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి యూరియాను పాటు ఎరువుగా వాడవచ్చు. పత్తి విత్తిన 20 రోజుల నుంచి ఐదుసార్లు వాడాలి. వాడిన ప్రతిసారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగు సార్లు వాడాలి. కలుపు తీసే సమయం తర్వాత 20, 30, 50 రోజులకు యూరియాను వరిపైరుకు వేయాల్సి ఉంటుంది.
పాడి–పంట


