● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ
వనపర్తి: సంస్థానాధీశుల కాలం నుంచే విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వనపర్తికి విద్యాపర్తిగా పేరొచ్చింది. తాజాగా వనపర్తి ఐటీఐని ఏఐపీ (అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్) హబ్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) క్లస్టర్–8లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. రూ.240 కోట్లతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1953లోనే వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో సాంకేతిక విద్య, ఉన్నత విద్యకు నిలయంగా మారింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో వనపర్తి ఐటీఐకి గద్వాల, మహబూబ్నగర్ బాలికలు, డిండి, మన్ననూరు ఐటీఐలను అనుసంధానం చేస్తూ ఏఐపీ హబ్గా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఉన్నతవిద్యతో పాటు పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ నైపుణ్య శిక్షణకేంద్రాల్లో వనపర్తి ఒకటిగా మారనుంది. ఈ ప్రాజెక్టుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర కోర్సులు, అధునాతన మిషన్ల తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
ఇక్కడి నుంచే ఉద్యోగ అవకాశాలు..
ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఇక్కడ సాంకేతిక విద్యాబోధన అందిస్తారు. వారి అవసరాలకు అనుగుణంగా హబ్ పరిధిలోని విద్యార్థులను తీర్చిదిద్దుకొని కోర్సు పూర్తి చేయకముందే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. క్యాంపస్ నియామకాలకు వనపర్తి వేదిక కానుంది. దీంతోపాటు పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా విద్యార్థులకు అప్రెంటిస్షిప్లు, మెరుగైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎంపికయ్యే పరిశ్రమ భాగస్వామి కంపెనీలు ప్రభుత్వం కలిసి ఐదేళ్లపాటు క్లస్టర్ను నిర్వహిస్తూ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు శిక్షణ నాణ్యతను పెంచి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దనున్నారు.


