మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో 8 చోట్ల ప్లాంట్లు
రీజియన్ పరిధిలో ఒకప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఏడేళ్ల క్రితమే ఆయా బస్టాండ్లు, డిపోలలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్కో కంటే సోలార్కు తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటమే గాక నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆర్టీసీ సంస్థకు బాగానే కలిసొచ్చింది.
– సంతోష్కుమార్,
ఆర్ఎం, టీజీఎస్ఆర్టీసీ, మహబూబ్నగర్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సోలార్ పవర్ ప్లాంట్లతో టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్ ఏడేళ్లుగా ఎంతో ఆదా పొందుతోంది. ట్రాన్స్కో కంటే సోలార్ విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతినెలా సంస్థకు భారం తగ్గింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ రెడ్కో) ఆధ్వరంలో ఎనిమిది చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గద్వాల డిపో, బస్టాండులో 44 కిలోవాట్లు, నారాయణపేటలో 40 (25+15) కిలోవాట్లు, కొల్లాపూర్లో 30 (20+10), మహబూబ్నగర్లో 30 (20+10), వనపర్తిలో 25 (15+10) కిలోవాట్లు, నాగర్కర్నూల్లో 20 , షాద్నగర్లో 20 (10+10), కల్వకుర్తిలో 15 కిలోవాట్లు సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఎక్కడికక్కడ సూర్యరశ్మి బాగానే పడేందుకు వీలుగా ఆయా బస్టాండ్లు, అలాగే డిపో గ్యారేజీలపైన పలకలను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మెయిన్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఏ రోజుకారోజు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో.. ఎంత వాడుకుంటున్నారనేది తెలియడానికి టు వే మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాంట్లు 25 ఏళ్ల పాటు కొనసాగేందుకు అప్పట్లోనే ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మహబూబ్నగర్ బస్టాండు పైన ఉన్న సోలార్ పవర్ ప్లాంటు ద్వారా ప్రతి రోజూ 50 నుంచి 80 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. అలాగే డిపో గ్యారేజీపైన ఉన్న ప్లాంటు ద్వారా 80 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది.
10 నుంచి 44 కిలోవాట్ల వరకు సామర్థ్యం
2019లోనే కేంద్ర ప్రభుత్వం,
రెడ్కో సౌజన్యంతో ఏర్పాటు
అప్పట్లోనే విద్యుదుత్పత్తి గ్రిడ్కు అనుసంధానం
ప్రతినెలా సంస్థకు విద్యుత్ బిల్లులలో రాయితీ వస్తున్న వైనం


