● జిల్లా న్యాయసేవాధికార సంస్థ
జడ్జి ఇందిర
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలబాలికల భద్రత, వారి ప్రాథమిక హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ జడ్జి ఇందిర అన్నారు. స్థానిక ఎంబీహెచ్ఎస్ పాఠశాలలో కొనసాగుతున్న శ్రీఇంటిగ్రేటెడ్ ఇన్సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్’ (ఉపాధ్యాయ శిక్షణ) కేంద్రాన్ని బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారితో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి ఇందిర మాట్లాడుతూ ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా, పిల్లల మానసిక, శారీరక భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల వాతావరణం ప్రతి విద్యార్థికి సురక్షితంగా ఉండాలని, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు, న్యాయపరమైన అంశాలపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలు లేదా వేధింపుల సంకేతాలను ఉపాధ్యాయులు ప్రారంభంలోనే గుర్తించి, వారికి తగిన ధైర్యాన్ని మరియు న్యాయపరమైన రక్షణను అందించడంలో ముందుండాలన్నారు. బాలలకు లేదా సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా లభించే ఉచిత న్యాయ సహాయం మరియు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇందిర వివరించారు. డీఈఓ విజయకుమారి మాట్లాడుతూఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఉపాధ్యాయులలో బాధ్యతాయుతమైన దృక్పథాన్ని మరింత పెంపొందిస్తాయన్నారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులందరూ ఈ విషయాలను పాఠశాలల్లోఅమలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాసులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.


