జడ్చర్ల: మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి చేపట్టిన భూ సేకరణ రికార్డులను మాయం చేసిన అధికారులపై సమగ్ర విచారణ జరిపాలని కోరురూ సోమవారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు భూనిర్వాసితులు ఫిర్యాదు చేశారు. 2017లో రిజర్వాయర్ పరిధిలోని వల్లూరు గ్రామానికి సంబంధించిన రైతుల నుంచి భూ సేకరణకు అంగీకారం తీసుకున్నారు. ఆ సమయంలో తమ వ్యవసాయ భూముల్లో గల బోర్లు, పైపులైన్లు, చెట్లు, పుశువుల కొట్టాలు తదితర నిర్మాణాలకు సంబంధించి పరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే తమ నుంచి అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. తదుపరి పరిహారం అందించలేదని ఇందుకు సంబంధించిన రికార్డులను కూడా అప్పటి తహసీల్దార్ లక్ష్మీనారాయణ, గిర్దావర్ సుదర్శన్రెడ్డి మాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ప్రస్తుత అధికారులు ఆయా రికార్డులు తమ వద్ద లేవని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


