● ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధం
● కాలిబూడిదైన రూ.3 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు
గద్వాల క్రైం: దేవుడికి పెట్టిన దీపం నుంచి వచ్చిన నిప్పురవ్వల కారణంగా నిరుపేద కుటుంబానికి చెందిన పూడి గుడిసె దగ్ధమైన ఘటన గద్వాల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. పిల్లిగుండ్ల కాలనీకి చెందిన బుడగ జంగలగోపాల్ రియల్ వ్యాపారం, భార్య ప్లాస్టిక్ సామాగ్రి, సిల్వర్ గిన్నెల విక్రయాలు చేస్తున్నారు. ఉదయం వారు ఉంటున్న గుడిసెలో పూజ చేసి దీపం వెలిగించి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు దీపం నుంచి వెలువడిన నిప్పురవ్వలకు గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున అలుముకోవడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలు అదుపులోకి తెచ్చారు.
సర్వం కోల్పయిన వైనం...
ప్రమాదంలో ఇంటి అవసరాల కోసం ఇటీవల అప్పుగా తీసుకొచ్చిన రూ.3 లక్షల నగదు, 3 తులాల బంగారం, 10 తులాల వెండి, ఇతర వంట సామగ్రి బూడిదయ్యాయి. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.


