● కేసు కోర్టు పరిధిలో ఉండగానే దారుణం
● నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్
పెంట్లవెల్లి: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం జరిగిన ఆర్ఎంపీ మల్లయ్య హత్యకు భూవివాదమే కారణమని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 31న రాత్రి 8 గంటల సమయంలో మల్లయ్య హత్యకు గురయ్యాడని, ఈ ఘటనపై దర్యాప్తు చేయగా క్లీనిక్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన వివరాల ప్రకారం నిందితులు పెంట్లవెల్లికి చెందిన బింగి కృష్ణయ్య, బింగి ఎల్లమ్మ, బింగి నాగమ్మగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మృతుడితో తమకు మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోందని తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఆ వివాదంపై 14 కేసులు పోలీస్స్టేషన్లో నమోదయ్యాయని, గతంలో కూడా గ్రామ పెద్దలతో పలుమార్లు కూర్చొని మాట్లాడారన్నారు. సివిల్ కేసులు వేసుకుని వీరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఒకరిపై ఒక్కరు ధ్వేషం పెంచుకున్నారని తెలిపారు. అందులో భాగంగా జూలై 31న ఇరువర్గాలు కోర్టుకు వెళ్లగా.. అక్కడ జరిగిన వాగ్వాదాన్ని దృష్టిలో పెట్టుకుని అదే రోజు గ్రామానికి చేరుకొని, పథకం ప్రకారం మల్లయ్యపై దాడి చేసి హత్య చేసినట్లుగా వారు ఒప్పుకున్నారని వెల్లడించారు. నిందితలను ఆదివారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి అదే రోజు రిమార్డుకు తరలించినట్లుగా ఆయన తెలిపారు. అదే విధంగా ఈ హత్యకు ప్రోత్సహించిన అదే గ్రామానికి చెందిన డిశ్ శేఖర్పై కూడా కేసు నమోదు చేశామని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.
మల్లయ్య హత్య దారుణం
పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ మల్లయ్య హత్య దారుణమని తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్రెడ్డి అన్నారు. భూ వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టు లో కొనసాగుతుండగా.. నిందితులు ఆవేశపడ్డారని అభిప్రాయపడ్డారు. దోషులను కఠినంగా శిక్షించాలని డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. అదే విధంగా నిందితులకు బెయిల్ రాకుండా న్యాయ వాదుల తరఫున పోరాడతామని వెల్లడించారు.


