వర్షాకాలం ప్రారంభమై నెలన్నర దాటింది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క వాన కురువలేదు. అడపాదడపా కురిసిన చిరుజల్లులకు ఆరుతడి పంటలు విత్తుకున్నాం. అక్కడక్కడ మొలిచిన మొలకలేమో ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిన అన్నదాతలు వరుణుడి కరుణ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎలాగైనా వానలు కురిపించాలంటూ తీరొక్క పూజలు చేస్తూ దేవుళ్లను వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తిమ్మాజిపేట మండలంలోని చేగుంటలో వనవాసం నిర్వహించారు. ఊళ్లోని జనాలంతా కలిసి పొలాలకు వెళ్లి అక్కడే వంటలు వండుకొని సాయంత్రం వరకు ఉండి వచ్చారు. అలాగే నేరళ్లపల్లి గ్రామ సమీపంలోని కావేరమ్మ చెరువు గట్టు వద్ద బండలపై వరద పాశం పోసి తాగారు. – తిమ్మాజిపేట


