సల్ఫైడ్తో దుష్ప్రభావం..
మిడ్జిల్: చౌడు పొలాలలో వరిలో అధిక దిగుబడి సాధించేందుకు యాజమాన్య పద్ధతులు సహకరిస్తాయని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ సూ చించారు. ముఖ్యంగా చౌడును తట్టుకొను స్వర్ణ, నెల్లూరి సోన, సిఎస్ఆర్–13 వంటి రకాల వడ్లను ఎన్నుకుంటే మంచి లాభాలు ఆర్జింజవచ్చన్నారు.
నారుమడి యాజమాన్యం..
చౌడు సమస్య ఉన్నప్పుడు సాధారణ నారు పెంచితే నారుమడి సరిగా రాదు. కావున రైతులు చౌడు పొలాల్లో వీలైనంత ఎక్కువ సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. నారుమడిలో వేయాల్సిన ఎరువుల మోతాదు పెంచాలి. ముఖ్యమంగా భాస్వరం,ఎరువులు సిఫారుసు మోతాదు కంటే రెట్టింపు వేయాలి. నారుమడిలో జింకులోపం వచ్చే ఆవకాశం ఉన్నందున ఎకరానికి సరిపోవు నారుమడికి, తప్పనిసరిగా 1కిలో జింకు సల్పేట్ వేసుకోవాలి. అలాగే నారు పెరిగే సమయంలో పశువుల ఎరువునుగాని, గొర్రెల ఎరువును గాని పొడి చేసి లేదా వర్మి కంపోస్టును నారుమడిలో పలుచగా చల్లుకోవాలి.
ప్రధాన పొలం యాజమాన్యం..
ప్రధాన పొలంలో చౌడు తీవ్రతను తగ్గించుటకు ప్రతి పంటకు తప్పనిసరిగా పచ్చిరొట్ట, పంటలైన జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర పంటలు వేసి పూత సమయంలో పొలంలో బాగా కలియదున్నాలి. చౌడు పొలాలు బాగా దమ్ముచేసి నీరు తీసివేయాలి. చౌడు పొలాల్లో లేత నారు నాటడం వలన అలాగే ౖపైపెన నాట్లు వేయడం వలన లవణాల ప్రభావంతో నారు చనిపోయే ఆవకాశం ఉంది. ముదురునారును దూరం తగ్గించి నాటుకోవాలి. పొలంలో చౌడు ఉన్నప్పుడు నీటీ యాజమాన్యంలో కూడా మార్పులు చేసుకోవాలి. పొలంలో నీరు ఉంచుతూ, తీసివేస్తూ కొత్త నీరు పెట్టడం వలన లవణాల సాంధ్రత పెరగకుండా నిరోధించవచ్చు. అలాగే చౌడు పొలాల్లో అంతరకృషి చేయడం లేదా కోనోవీడర్ గానీ పవర్వీడర్ తిప్పడం వలన చౌడు ప్రభావం కొద్దిగా తగ్గించవచ్చు. శాశ్వత చౌడు నివారణకు రైతులు ఎప్పటికప్పుడు పచ్చిరొట్ట పైర్లను సాగుచేయడం ,సేంద్రియ ఎరువులు అధికంగా వాడడం, భూసార పరీక్షల అనంతరం జిప్పం లాంటి రసాయన ఎరువులను వేసి నీరు పెట్టి బాగా కలియదున్నడం వల్ల లవణాల సాంధ్రతను తగ్గించి చౌడును నివారించే ఆవకాశం ఉంటుంది.
వరి నేలలో అప్పడప్పుడు పంట మొత్తం పసుపు వర్ణంలోకి మారిపోవడటం, మట్టి మెత్తగా ఉండి కాలు చాలా లోతుగా దిగబడిపొవడం జరుగుతుంటుంది. అలాగే నేల నుంచి దుర్గంధం, మొక్కను వేర్లను బయటకు తీసినప్పుడు కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంటుంది. పంట వేర్లు పూర్తిగా నల్లబడి మొక్కలు పూర్తిగా చనిపోయే ఆస్కారం ఉంటుంది. వరి చేనులో ఇటువంటి పరిస్థితికి కారణం స్థానికంగా అధిక నీటి ముంపు, తగిన రీతిలో పంట వేర్లకు గాలి అందకపోవడం, సల్పర్ 20–20–0–15 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడడం, అలాగే నీటి ముంపు ఉన్న పొలాల్లో సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. దుష్ప్రభావం నివారణకు పైర్లు వేయడానికి ముందు 1–2 బండ్ల ఎర్రమట్టిని వేసి బాగా కలియబెట్టి ఆరబెట్టడం, భూమిని ఎత్తు చేయడానికి మట్టిని పోసుకోవాలి. అలాగే మురుగునీరును తీసివేసి కొత్తనీరు అందిస్తే మంచి ఫలితం ఉంటుంది.
పాడి–పంట


