మహబూబ్నగర్ మున్సిపాలిటీ/నారాయణపేట/మక్తల్: ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో హ్యామ్ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిరోడ్లు ఉంటేనే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.. అభివృద్ధికి నాణ్యమైన రహదారులే పునాదులని అన్నారు. గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని నిరక్ష్యం చేసిందని విమర్శించారు.పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణలో ప్రజలు సహకరించాలని.. భూము లు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్క ప్యాకేజీలోనే రూ. 547 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించిన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని భారీ ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
మంత్రులకు స్వాగతం
మహబూబ్నగర్జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనస్వాగతం పలికారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పనతో పాటు పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి, ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, వీర్లపల్లి శంకర్, నగర మేయర్ జి.మమత, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


