● ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేసిన పోలీసులు
మహబూబ్నగర్ క్రైం: ఒక ముగ్గురు మహిళలు స్థానిక కాలనీ రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతూ కన్పించడంతో స్థానికులు వారిని పట్టుకున్నారు. నగరంలోని హబీబ్నగర్ ఏరియాలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు మహిళలు చేతుల్లో చాక్లెట్లు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుంటే స్థానికులు పట్టుకున్నారు. చాక్లెట్లు ఇచ్చి పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించి కాలనీవాసులు వారిని చుట్టుముట్టారు. ఈ విషయం వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఢిల్లీ, హర్యానకు చెందిన నాలుగు కుటుంబాలుగా గుర్తించి ఆధార్ కార్డులు ఇతర వివరాలు పరిశీలించారు. ఈ కుటుంబాలు ప్రతి ఏడాది జీవనోపాధిలో భాగంగా పాఠశాలలకు తిరుగుతూ పేపర్లతో మ్యాజిక్ చేస్తూ జీవనం గడుపుతున్నట్లు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ఈ నాలుగు కుటుంబాల్లో ఎవరూ కూడా కిడ్నాప్ చేసే గ్యాంగ్ కాదని ఎస్ఐ వెల్లడించారు.


