హన్వాడ: వర్షాకాలం సాగు పను ల్లో బిజీగా ఉన్న రైతులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త అందించింది. యూరియా బుకింగ్లో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు వ్యవసాయ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో స్మార్ట్ఫోన్ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలనే నిబంధనల వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని వారు తీవ్ర ఇబ్బందులు పడే వారు. ఈ సమస్యను గుర్తించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలోని మీసేవ విభాగం, వ్యవసాయ శాఖతో కలిసి ఈ కొత్త అవకాశాన్ని కల్పించింది. దీంతో ఇకపై స్మార్ట్ఫోన్ లేకపోయినా, యాప్ వాడటం తెలియకపోయినా రైతులు సులభంగా మీసేవా కేంద్రాలకు వెళ్లి యూరియా బుక్ చేసుకోవచ్చు.
బస్తాకు రూ.10ల నామమాత్రపు రుసుం
రైతులు ఒక్క యూరియా బస్తాకు కేవలం రూ.10ల చొప్పున నామమాత్రపు సేవా రుసుము చెల్లించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడీ, బుకింగ్ తేదీని మినహాయించి 48గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసే లోపు డీలర్ను సంప్రదించి యూరియా కొనుగోలు చేయాలి. ఓటీపీ కోసం రైతులు తమ పట్టాదారు పాస్బుక్తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్ యాక్టివ్లో ఉంచుకోవాలి. ఎంటువంటి సందేహాలున్నా ఏఈఓ (విస్తరణ అధికారి), ఎంఏఓ (మండల వ్యవసాయాధికారి), లేదా సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈవెసులుబాటును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
ఇక మీసేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
బుకింగ్ ఐడీ 48గంటల చెల్లుబాటు
యూరియా బస్తాకు మీసేవ రుసుము రూ.10


