జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని వారాలుగా వందకు పైగా ఫిర్యాదులు వస్తుండగా.. పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా సోమవారం నిర్వహించిన ప్రజవాణిలోనూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టర్ ఖుష్బూగుప్తా 132 అర్జీలు స్వీకరించారు. ఇందులో ఎక్కువగా మున్సిపల్, పంచాయతీరాజ్, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి, ప్రణాళిక, విద్యుత్, విద్య, వైద్య ఆరోగ్యం, అటవీ, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. అలాగే జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అధికారులందరూ తప్పనిసరిగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో లైఫ్ మెంబర్ రూ.వెయ్యి చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని చెప్పారు. అలాగే జిల్లాలో సభ్యత్వ సంఖ్యను పెంచడంతోపాటు రెడ్క్రాస్ నిర్వహిస్తున్న రక్త బ్యాంకులు, పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం వంటి మానవతా సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రెయినీ సాయిశివాని, డీఆర్ఓ నిర్మల, డీపీఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు
బాధితుల నుంచి వినతులు
స్వీకరించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా
పరిష్కారంలో నిర్లక్ష్యం
వహించొద్దని అధికారులకు ఆదేశం


