కొల్లాపూర్: పట్టణంలోని జమ్మాన్గడ్డలో నివాసం ఉంటున్న బత్తిని మౌనిక (21) అనే గర్భిణి మంగళవారం ఉదయం మృతి చెందిన ఘటనలో మౌనిక సోదరుడు చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాదవరావుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు రామాపురానికి చెందిన మౌనిక కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కొల్లాపూర్లో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నాలుగు నెలల గర్భంతో ఉన్న మౌనికకు ఇటీవల అమ్మతల్లి సోకింది. సోమవారం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇరువురి మధ్య కుటుంబ విషయాల నేపథ్యంలో వాగ్వివాదం జరిగింది. దీంతో మౌనిక తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంటి వద్ద వాగ్వివాదం జరిగిన సమయంలో మౌనికపై నాగరాజు దాడికి పాల్పడ్డాడని, అందుకే ఆమె అస్వస్థతకు గురైందని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.బండారి సురేష్ తెలిపారు.


