స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక యాప్
సాక్షి, మహబూబాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మాలో జరిగే అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లోకోస్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా సభ్యులతో పాటు కేంద్ర ప్రభుత్వం రుణాల వివరాలు సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది. కాగా, జిల్లాలో యాప్ ఈ–కేవైసీ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ పూర్తయితే స్వయం సహాయక సంఘాల్లో జరిగే అవకతవకలకు, అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
లోకోస్ యాప్ ఈ–కేవైసీ ప్రక్రియ జిల్లాలో 33శాతం పూర్తి చేశారు. 18 మండలాల పరిధిలో 668 గ్రామైక్య సంఘాల్లో 16,294 స్వయం సహా యక సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,25,151 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 1,15,228 మందికి బ్యాంకు అకౌంట్లు, 1,14,826మందికి ఆధార్ లింక్ అయి ఉంది. వీటి ఆధారంగా జిల్లాలో యాప్లో ఈ–కేవైసీ ప్రక్రియ 41,473 మంది వివరాలు నమోదు చేశారు. అంటే 33.14శాతం పూర్తిచేశారు. ఇందులో అత్యధికంగా చిన్నగూడూరు మండలంలో 57శాతం, దంతాలపల్లి 52శాతం, అత్య ల్పంగా గంగారం మండలంలో 10శాతం ప్రక్రియ పూర్తి చేశారు. అదే విధంగా మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సి పాలిటీల పరిధిలో 111 పట్టణ సమైక్యలు ఉండగా 3,180 సంఘాల్లో 30,790 మంది సభ్యులు ఉన్నారు. అయితే మెప్మా పరిధిలో మాత్రం లోకోస్ ఈ–కేవైసీ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించలేదు.
ప్రభుత్వం తీసుకొచ్చిన లోకోస్ యాప్ ద్వారా ఎక్కడ అక్రమాలు జరిగినా తెలిసిపోయే అవకాశం ఉంది. దీంతో తమ ఆటలు సాగవని అక్రమార్కులు భయపడుతున్నారు. జిల్లాలోని పలు మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకోవడం, చెల్లించిన డబ్బులు జమ చేయకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను సభ్యులకు తెలియకుండా కాజేసిన సంఘటనలు ఉన్నాయి. ఒకే సంఘం పేరున వేర్వేరు బ్యాంకుల్లో సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకోవడం, వారి సొంత అవసరాలకు వాడుకోవడం, డబ్బులు చెల్లించకుండా ఎన్పీఎల్లో పడే వరకు చూచి సెటిల్మెంట్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. లోగోస్ యాప్తో ఇటువంటి అక్రమాలకు చెక్ పడనుంది. దీంతో ఇంతకాలం ఇష్టారాజ్యంగా సాగిన వ్యవహారం ఇక ముందు సాగదనే భయం పట్టుకుంది.
జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియ షురూ
గ్రామీణ ప్రాంతాల్లో 33శాతం పూర్తి
మెప్మాలో ప్రారంభంకాని ప్రక్రియ


