మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీలో..
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టర్ స్నేహశబరీష్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషొత్తం, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయాలి
● ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్ రూరల్ :దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశ సేవకు ప్రతీ ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించగా.. ఎస్పీ శబరీష్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతంర ఎస్పీ మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని, పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పోలీసు అధికారులకు సేవా పతకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంట పొలంలో త్రివర్ణ పతాకం రెపరెపలు
జిల్లాకేంద్రం శివారు అనంతారం గ్రామ శివారులో కౌలురైతు అడిదల వీరభద్రం వరిపొలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. వరినాట్లు వేసేందుకు వచ్చిన కూలీలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
– మహబూబాబాద్ రూరల్


