● రెడ్క్రాస్ రాష్ట్ర
పాలకమండలి సభ్యుడు శ్రీనివాస్రావు
హన్మకొండ అర్బన్ : తలసేమియా, సికిల్ సెల్ వంటి జన్యుపరమైన రక్త వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వం అందించనున్న పెన్షన్.. ఆర్థికసాయం మాత్రమే కాదని, వారి కుటుంబాలకు గొప్ప భరోసానిస్తోందని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధులతో జీవితాంతం పోరాడుతున్నారని, వారికి క్రమం తప్పకుండా రక్త మార్పిడి, మందులు, వైద్య పరీక్షలు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. వివాహానికి ముందు హీమోగ్లోబిన్, హెచ్పీఎల్సీ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్ తరాలను ఈ వ్యాధుల నుంచి కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతున్నప్పటికీ ఇతర ఖర్చులతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15నుంచి తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు పెన్షన్ అమలు చేయనున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.


