దామెర : మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్సీఓగా శ్రావణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. మండలంలోని ఒగ్లాపూర్ ఎంజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఆర్సీఓగా విధుల నిర్వహించిన ఎం.రాజ్కుమార్ బదిలీపై కరీంనగర్కు వెళ్లారు. హైదరాబాద్ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ను వరంగల్కు బదిలీ చేయగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు.
మస్కట్ నుంచి స్వదేశానికి..
● మాజీమంత్రి కేటీఆర్ చొరవతో
బాధితురాలికి విముక్తి
శంషాబాద్ : ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ అక్కడ చిత్రహింసలు భరిస్తూ బందీగా మారిన పరిస్థితి నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు మాజీ మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్న బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు.. వరంగల్కు చెందిన మహ్మూదా కేర్ టేకర్గా పని చేసేందుకు జూలై 16న మస్కట్కు వెళ్లింది. అయితే తాను వర్క్ వీసాపై కాకుండా విజిట్ వీసాపై అక్కడికి వెళ్లినట్లు తెలుసుకుంది. తనతో పని ఒప్పందం కుదుర్చుకున్న వారు చెప్పిన పని కాకుండా వేరే పనులు చేయించడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారని వాపోయింది. తనపై చోరీ నెపం నెట్టి జైల్లో పెడాతమని కూడా సదరు యజమాన్యం భయపెట్టారని పేర్కొంది. అతి కష్టం మీద తన చెల్లికి ఫోన్లో సమాచారం చేరవేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ సాయంతో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఇరుదేశాల ఎంబసీలకు సమాచారం అందించారన్నారు. కేటీఆర్ సొంత ఖర్చులతో తాను హైదరాబాద్కు చేరుకున్నట్లు ఆమె తెలిపింది. పనికోసం పొరపాటున కూడా ఎవరు విజిట్ వీసాపై విదేశాలకు వెళ్లకూడదని బాధితురాలు పేర్కొంది.
పాము కాటుతో రైతు మృతి
గంగారం : పాము కాటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన మండలంలోని మర్రిగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈసం సూర్యనారాయణ (46) మొక్కజొన్న చేనులో యూరియా చల్లి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి పాముకాటు వేసింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించినట్లు ఎస్సై కోటేశ్వర్రావు తెలిపారు.
నేటినుంచి కేయూలో జాతీయ సదస్సు
● వీసీకి ఆహ్వాన పత్రిక అందజేత
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమైంది. నేడు, రేపు కేయూలోని పరిపాలన భవనం సెనెట్ హాల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యులు ప్రొఫెసర్ గాదె దయాకర్ పూర్తిచేశారు. జాతీయ సదస్సు నేపథ్యంలో పరిపాలన భవనానికి విద్యుత్ లైట్లతో అలంకరించారు. దీంతో పరిపాలన భవనం మంగళవారం రాత్రి విద్యుత్ కాంతులతో ఆకట్టుకుంటుంది. అలాగే వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులతో గాదె దయాకర్ సదస్సు సన్నాహక సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల సదస్సులో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ, తదితర సమకాలీన అంశాలపై నిపుణులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు చర్చించనున్నారని తెలిపారు.


