అశోక్నగర్లో పట్టుకుని పాకాల అడవిలో వదిలేసిన యువకులు
ఖానాపురం: ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్. తెలంగాణలో ఈ సర్పం అరుదైనది. ఈ సర్పాన్ని పట్టుకున్న యువకులు పాకాల అటవీ ప్రాంతంలో మంగళవారం వదిలేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామానికి చెందిన చెర్ప శ్రీకాంత్, సాయికుమార్, ప్రకాశ్, నవీన్, భాస్కర్, ధనసరి రాజులకు సోమవారం అర్థరాత్రి అశోక్నగర్ సబ్స్టేషన్ సమీపంలో అరుదైన పాము కనిపించింది. వీరిలో శ్రీకాంత్ అనే యువకుడు గతంలో అటవీశాఖలో పనిచేసిన అనుభవంతో ఆ పామును జాగ్రత్తగా పట్టుకుని సంచిలో బంధించారు. దీనిని మంగళవారం పాకాల అటవీప్రాంతంలో వదిలేశారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారి పుప్పాల రవికిరణ్ను సంప్రదించగా పాము ప్రత్యేకతను వివరించారు. రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుందని, తడిగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తుందని, చీమల పొదల్లోకి వెళ్తుందని వివరించారు. ఇది చైనా, నేపాల్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, సౌత్ చైనాలో అధికంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపిస్తుందని తెలిపారు.ఈ పాము తిప్పిపోయి లేదా లారీల్లో పడిపోయి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇది అత్యంత విషపూరితమైన సర్పమని, కాటువేస్తే నేరుగా మెదడుపై ప్రభావం పడి పక్షవాతం వచ్చి మృత్యువాత పడతారని, వెంటనే ఐసీయూలో చేరితేనే ప్రాణాలను రక్షించుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా దీనిని చూసినట్లు తెలిపారు.


