● నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
● చర్యలు చేపడుతున్న అధికారులు
● టెండర్ ప్రక్రియ షురూ
జిల్లాలో చేప పిల్లలు, చేపల దిగుబడి వివరాలు
నెహ్రూసెంటర్: జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. ఈమేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టేలా టెండర్ల ప్రక్రియకు అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని 1,229 చెరువుల్లో గతేడాది సుమారు 2కోట్ల మేరకు చేప పిల్లలను పంపిణీ చేశారు. అదనుదాటిన తర్వాత పంపిణీ చేయడంలో మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతమైన త్వరగా చేప పిల్లల పింపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
నాణ్యత పాటించాలని..
చేప పిల్లల పంపిణీలో నాణ్యత, కొలతలు, లెక్క ప్రకారం చెరువులోకి చేరడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చేప పిల్లల పంపిణీలో సరైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలకు బదులుగా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
లక్ష్యం చేరేలా..
జిల్లాలో 1,229 చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం, అధికారులు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. అన్ని చెరువుల్లో కలిపి సుమారు 4కోట్లకు పైగా చేప పిల్లలను వదలనున్నారు. 35–40 ఎంఎం, 80–100 ఎంఎం సైజ్ చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. అయితే సహకార సంఘాలకు నగదు బదిలీ చేయడం ద్వారా నాణ్యమైన పిల్లల్ని కొనుగోలు చేసి వర్షాల ప్రారంభంలోనే చెరువుల్లో వదులుకుంటామని మత్స్యకారులు కోరుతున్నారు.
టెండర్ల కోసం ఏర్పాట్లు...
జిల్లాలో 200 మత్స్యసహకార సంఘాలు, సుమారు 14 వేల మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం, మత్స్యశాఖ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. అదను దాటకుండానే చెరువుల్లో చేప పిల్లలను వదిలేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ టెండర్లను అహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం టెండర్దారులను ఎంపిక చేస్తామని, చేప పిల్లల పంపిణీకి సంబంధించిన చర్యలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
2023–24
4.20 కోట్లు 9 వేల టన్నులు
2024–25
1.8కోట్లు 23 వేల టన్నులు
చేప పిల్లల పంపిణీ


