హన్మకొండ : గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగంలో వినూత్న కార్యక్రమాల అమలు, సహకార సంఘాల బలపేతం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు 2025–26 సంవత్సరానికి నాబార్డు హనుమకొండ, ములుగు జిల్లా అభివృద్ధి మేనేజర్ లింగంపల్లి చంద్రశేఖర్కు ఆరు విభాగాల్లో ఉత్తమ డీడీఎం అవార్డు అందజేశారు. హైదరాబాద్లో జరిగిన నాబార్డు 45వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
నేడు మెగా జాబ్మేళా
హన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నేడు (శనివారం) మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి అరూరి శ్యామల తెలిపారు. ములుగు రోడ్డులోని మోడల్ కెరీర్ సెంటర్లో ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ బ్యాంకింగ్, సేల్స్, టెక్నికల్ సపోర్ట్ తదితర విభాగాల్లో ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి, కంపెనీ నిబంధనల ప్రకారం వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలు తదితర అవసరమైన పత్రాలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 80198 16641, 82472 55859, 63000 61059 నంబర్లలో
సంప్రదించాలని కోరారు.
కేయూ బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 18న (శనివారం) నిర్వహించాల్సిన బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. సీఎస్ఐఆర్, యూజీసీ, నెట్ పరీక్షల నేపథ్యంలో ఈనెల 16న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామని తెలిపారు. మళ్లీ ఆయా పరీక్షలు ఈనెల 27న నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలు, సమయంలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు.
ఏఆర్ పదోన్నతులకు
20న ఇంటర్వ్యూలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో అంతర్గతంగా పనిచేస్తున్న సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా (ఏఆర్) పదోన్నతి కల్పించేందుకు ఈనెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అర్హులైన 12మంది సూపరింటెండెంట్లకు జూన్ 10న రాతపరీక్ష నిర్వహించగా ఇప్పుడు వారికి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అర్హులకు కాల్ లెటర్లను సంబంధిత అధికారులు పంపారు. కాకతీయ యూనివర్సిటీలో ఆరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12 మంది సూపరింటెండెట్లలో రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి రూల్ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికై న అభ్యర్థులను త్వరలో జరగబోయే కేయూ పాలకమండలిలో ఆమోదం పొందాక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.


