న్యూస్రీల్
‘నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు కోసం స్థానిక తహసీల్దార్ పొంతన లేకుండా కూపన్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. 130 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డుకు 300 ట్రిప్పుల ఇసుక కూపన్లు ఇవ్వడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒక్క కూపన్ ఇచ్చేందుకు నానా ఇబ్బందులు పెట్టే అధికారులు అలా ఎందుకు చేశారనేది ప్రశ్నగా మారింది. అయితే కూపన్కు రూ.1,000 చొప్పున ముట్టజెప్పడంతోనే అలా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి’.
సాక్షి, మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేందుకు కూపన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా, కూపన్లు ఇచ్చేందుకు గృహనిర్మాణశాఖ, గ్రామ కార్యదర్శి ద్వారా ఽధ్రువీకరించిన పత్రాలు చూపించాలి. అప్పుడు తహసీల్దార్ కార్యాలయం నుంచి కూపన్లు పంపిణీ చేస్తారు. కాగా, నిజమైన లబ్ధిదారుల పేరుతో పలువురు అధికారులు బయటి వ్యక్తులకు కూపన్లు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఒక్కో కూపన్కు రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అక్రమార్కులు ఒక కూపన్ చూపించి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అసలు ఇందిరమ్మ లబ్ధిదారులకు కాకుండా.. ప్రైవేట్ అమ్మకాలకు ఇసుక తరలిస్తున్నారు.
కూపన్ల బేరం..
ఇందిరమ్మ ఇళ్లకోసం ఇసుక సరఫరా చేసేందుకు అందజేసే కూపన్లు చర్చనీయాంశంగా మరాయి. పలు మండలాల్లో బేరసారాల ద్వారా కూపన్లు అమ్ముకున్నట్లు ప్రచారం. ప్రధానంగా మండలాల్లోని పలుకుబడి ఉన్న నాయకులు, కాంట్రాక్టర్లు, పలువురు అధికారులు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూపన్లతోనే పని అవుతుందని చర్చ. కూపన్లు రాయించుకొని రావడం వాటిని ట్రాక్టర్ యజమానులకు ఇస్తే అప్పటి పరిస్థితిని బట్టి కూపన్కు రూ.500 నుంచి రూ.1000 వరకు ఇస్తారని చెబుతున్నారు. ఇలా ఇసుక కూపన్లు పలువురికి వరంగా మారి రోజువారి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి.
వ్యాపారుల మధ్య గొడవలు..
జిల్లాలోని ఆకేరు, మున్నేరు వాగుల నుంచి ఇసుక తరలింపు విషయంలో పలువురు ట్రాక్టర్ యజమానులు, ఇసుక వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మా ప్రాంతంలో ఉన్న ఇసుకను మేమే తొలుకుంటామని నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాలకు చెందిన పలువురు ట్రాక్టర్ యజమానులు మహబూబాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్లను అడ్డుకోవడం, అధికారులకు, నాయకులకు చెప్పి ఆ ట్రాక్టర్లను పట్టించడం, కేసులు పెట్టించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు చర్చ. అలాగే అక్కడి నుంచి ఇసుకను తీసుకొస్తుంటే.. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ట్రాక్టర్ యజమానులు, వ్యాపారులు ఆ ట్రాక్టర్లను అడ్డుకోవడంతో ఇరుపక్షాల మధ్య గొడవకు దారితీసినట్లు తెలిసింది.
దుర్వినియోగం చేస్తే చర్యలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరుతో ఇసుక వ్యాపారులకు కూపన్లు ఇవ్వడం నేరం. ఇస్తే విచారణ జరిపించి అధికారిపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలపై విచారణకోసం ఏడీ మైనింగ్ను నియమించాం. ఆయన నివేదిక ఆధారంగా శాఖారపరమైన చర్యలు తీసుకుంటాం.
– అనిల్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)
చిన్నగూడూరు మండలం ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు
మాట్లాడుతున్న డీఏఓ విజయచంద్ర
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక కూపన్ల అమ్మకాలు
ప్రైవేట్ వ్యక్తులకు జారీ.. డబ్బుల వసూలు
అధికారుల చేతివాటంతో అక్రమార్కుల హవా


