హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, చతుఃస్థానార్చన పూజలు నిర్వహించారు. దశమహావిద్యలలోని కాళీక్రమాన్ని అనుసరించి అమ్మవారి స్నపన మూర్తిని కపాలినీగా, షోఢశీ క్రమాన్ని అనుసరించి అమ్మవారి బోగభేరాన్ని భగమాలినీగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు.


