మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ 2026–27విద్యా సంవత్సరం ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జిల్లాలో మొదటి విడతలో 76 స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతుల ప్రారంభించనున్నారు. కాగా, ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు ఇంటర్, టీటీసీ మెరిట్ జాబితా ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇంటర్వ్యూల ద్వారా ఇన్స్ట్రక్టర్ల నియామకం చేపడుతుండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామకాల్లో అవకతవకలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాలు..
జిల్లా వ్యాప్తంగా 76 స్కూళ్లలో 152 పోస్టులకు 428 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొ దట మెరిట్ జాబితా ప్రకారం పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన అధికారులు ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడంతో రాజకీయ నాయకుల జోక్యంపై అభ్యర్థులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. కాగా, నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడుతామని ఎక్కడ కూడా తెలుపలేదు. ప్రభుత్వ నింబధనలకు విరుద్ధంగా ఇన్స్ట్రక్టర్లు, ఆయాల ఎంపికలో జిల్లా విద్యాశాఖ అధికారులు అభ్యర్థులకు ముందస్తు ఫోన్లు చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పైరవీలతో నియామకాలు చేపడుతూ.. అర్హులకు అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రోజుకో మండలంలో..
జిల్లాలో 18 మండలాలు ఉండగా.. రోజుకో మండలంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గుట్టుచప్పు డు కాకుండా అభ్యర్థులకు ఫోన్లు చేసి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలుపుతున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఆ తర్వాత నిర్వహించబోమని మండల విద్యాశాఖ అధికారులు అభ్యర్థులను భయభ్రాంతకులకు గురిచేస్తున్నట్లు తెలిసింది.
అవకతవకలు జరిగితే ఆందోళనలే..
ప్రీప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయాల ఎంపికల్లో ఏమైనా అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. అర్హులైన మహిళా అభ్యర్థులను మెరిట్ జాబితా ప్రకారం ఎంపిక చేయాలి. స్థానికంగా ఆ వార్డులో, స్కూల్కు దగ్గరగా ఉండే వారిని నియమించాలి.
– గంధసిరి జ్యోతిబసు,
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు
ప్రీప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకంపై రాజకీయ నాయకుల జోక్యం
నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్వ్యూలు
అవకతవకలు జరుగుతున్నట్లు పలువురు అభ్యర్థుల ఆరోపణ


