ఈనెల 7వ తేదీన కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. అక్కడ ఎంపీ పోరిక బలరాంనాయక్ అంగన్వాడీ వ్యవస్థ బాగా లేదని.. మార్పు రావాలని ఆదేశించారు. ఆ సమావేశంలో కమిటీ సభ్యుడు బాబురావు మాట్లాడుతూ.. ఇనుగుర్తి మండలంలో పలు సెంటర్లలో టీచర్లు సమయపాలన పాటించడం లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపారు.
మహబూబాబాద్: జిల్లాలో అంగన్వాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇస్తున్నా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఇవ్వని విద్యుత్ కనెక్షన్లు, సరిపడాలేని మరుగుదొడ్లు, కిచెన్ గార్డెన్ల ఏర్పాటులోనూ నిర్లక్ష్యమే. దీనికి తోడు టీచర్లు, ఆయాల కొరతతో కేంద్రాల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇదిలా ఉండగా కొంత మంది టీచర్లు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
1,437 కేంద్రాలు..
జిల్లాలోని 18 మండలాలకు గాను 5 ప్రాజెక్ట్ల పరిధిలో 1,437 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరు నెలల లోపు పిల్లలు 2,867మంది, ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 17,241 మంది, మూడు నుంచి ఆరేళ్ల పిల్ల లు 16,279 మంది, 3,867మంది గర్భిణులు, 2,679 మంది బాలింతలు ఉన్నారు. మూడు సంవత్సరాలలోపు పిల్లలకు టీహెచ్ఆర్ ఇస్తారు.
అద్దె భవనాల్లో కేంద్రాలు..
475 కేంద్రాలు అద్దె భవనాల్లో, 336 సెంటర్లు సొంత భవనాల్లో, 626 కేంద్రాలు ఫ్రీ రెంటెండ్ (అద్దె లేకుండా ప్రభుత్వ పాఠశాలలు)లో కొనసాగుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో కనీససౌకర్యాలు లేక పిల్ల లు ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అద్దెకు అన్ని వసతులు ఉన్న ఇల్లు కిరాయికి ఇవ్వకపోవడంతో అద్దెకు తగ్గట్లు టీచర్లు గదులను తీసుకుంటున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం..
118 మరుగుదొడ్ల నిర్మాణాలు కేవలం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. 1,200 కేంద్రాల్లోనే మరుగుదొడ్లు ఉన్నాయి. ఫ్రీ రెంటెండ్లో నిర్వహించే కేంద్రాల్లో కూడా సక్రమంగా లేవు. స్కూల్ పిల్లలకు అంగన్వాడీ పిల్లలకు సరిపోవడం లేదు.
ఖాళీలతో సమస్య..
1,437 కేంద్రాలకు 1,309 మంది టీచర్లు, 957 మంది ఆయాలు, 49 మంది సూపర్వైజర్లు మాత్రమే ఉన్నారు. దీంతోపలుచోట్ల ఇన్చార్జ్లతో కాలం వె ల్లదీస్తున్నారు. ఇదే అదునుగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జిల్లాలో ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడం గమనార్హం. దీనికితోడు కేవలం 1,082 కేంద్రాల్లో మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఒకటో నంబర్ కేంద్రం నిర్వహిస్తున్నారు. 2019లో పిల్లల తల్లిదండ్రులు టీచర్ సహకారంతో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. ప్రతీ నెల టీచర్ బిల్లు చెల్లిస్తుంది. టెక్నికల్ సమస్య కారణంగా ఉచిత సౌకర్యం ఇవ్వలేదని టీచర్ తెలిపారు. బీసీ కాలనీలో సొంత భవనంలో కొనసాగుతున్న కేంద్రానికి సైతం ఇంత వరకు కనెక్షన్ లేకపోవడం గమనార్హం.
విద్యుత్ కనెక్షన్ ఇవ్వని బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రం
పలుచోట్ల మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు కరువు
సమయపాలన పాటించని పలువురు టీచర్లు
జిల్లాలో మొత్తం 1,437 అంగన్వాడీ కేంద్రాలు
నిర్వహణపై ఎంపీ అసహనం..


