గూడూరు: ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి ద్వారా ఆధునిక సర్వే విధానాలతో సరిహద్దులు, భూ విస్తీర్ణం నిర్ధారిస్తే వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. మండలంలోని భూపతిపేటలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రీ సర్వేలో సోమవారం గ్రామ సరిహద్దులను గుర్తించే పనిని సర్వే టీం ప్రారంభించింది. అదనపు కలెక్టర్ సందర్శించి సరిహద్దులను పరిశీలించి, తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగభవాని, సర్వేయర్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో సోమవారం ఉపాధ్యాయులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. హిందీ, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, సోషల్స్టడీ సబ్జెక్ట్ల బోధనలో ఉపాధ్యాయులు వినూత్న మార్పులు తీసుకురావాలన్నారు. విద్యార్థి కేంద్రిత బోధన, చురుకై న అభాస్యం, సాంకేతిక వినియోగంపై అవగాహన పెంపొందించుకొని పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఏఎంఓ వెంకటేశ్వర్లు, రిసోర్స్పర్సన్లు శ్రీరాములు, రమేశ్, వందన, సంపత్, వహిద్, రాజ్, ప్రేమ్సాగర్, నబి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు
విద్యారణ్యపురి: హైదరాబాద్లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ–27) ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 19వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 26న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీ//టీఎస్స్టడీసర్కిల్.కో.ఇన్లో చూడాలని ఆయన కోరారు.
లక్ష్మీ నర్సింహ శతకం ఆవిష్కరణ
విద్యారణ్యపురి: కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు కవి చంద్ర నర్సింగోజు లక్ష్మయ్య రచించిన శ్రీ లక్ష్మీనర్సింహ శతకం పుస్తకావిష్కరణను సోమవారం నిర్వహించారు. కాకతీయ పద్యకవిత వేదిక అధ్యక్షుడు సమస్యా పృచ్ఛక చక్రవర్తి కందిశంకరయ్య ఈ శతకాన్ని ఆవిష్కరించారు. పద్య కవితా వేదిక బాధ్యులు అన్నావజ్జుల సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో సహృదయ సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు, విశ్రాంత విద్యాశాఖ అధికారి నన్నపనేని రామేశ్వర్రావు, వజ్జల రంగాచార్యులు, శతావధాని చేపూరి శ్రీరామ్, డాక్టర్ ఎన్వీఎన్ చారి, కె.రమేశ్, జీడికంటి శ్రీనివాసమూర్తి, పల్లేరు వీరస్వామి, అక్కర కరుణాసాగర్, గుంటి విష్ణుమూర్తి సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మ సన్నిధిలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు సమర్పించారు. ఎత్తు బంగారం, యాటలతో మొక్కులు చెల్లించుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు.


