
అర్హుల నిరీక్షణ!
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
‘ఈ ఫొటోలోని మానసిక దివ్యాంగుడు మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన గంట శ్రీనివాస్–మౌనిక దంపతుల కుమారుడు రాజేందర్. పుట్టిననాటి నుంచి 15ఏళ్లుగా మానసిక స్థితి బాగాలేక లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయినప్పటికీ ఆయనలో మార్పులేకపోవడంతో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2024 ఏప్రిల్ 19న వందశాతం అంగవైకల్యం ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల తల్లి మౌనిక మరణించడంతో తండ్రి కూలీ పనిచేస్తేనే కుటుంబం గడుస్తోంది. ఈ పరిస్థితిలో పింఛన్ వస్తే ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తున్నారు.’
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం అర్హులకు ఆత్మీయ భరోసా పింఛన్లు అందించి ఆసరాగా నిలుస్తోంది. అయితే 2022 ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో మూడేళ్లుగా సుమారు 20వేల మందికి పైగా కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమేరకు పింఛన్ మంజూరు చేయాలని సదరం సర్టిఫికెట్ పట్టుకొని కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రజాపాలనలో దరఖాస్తుల వెల్లువ..
రాష్ట్ర వ్యాప్తంగా 2024 జనవరిలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా 17,111 మంది పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా మూడు సంవత్సరాలుగా ప్రమాదాలు, వ్యాధులతో పాటు ఇతర కారణాలతో అంగవైకల్యం పొందిన వారు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంగవైకల్యం ఉందని డాక్టర్లు నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేసిన వారు మరో 1700మంది వరకు ఉంటారని, 1800 మేరకు ఇటీవల అర్హత పొందిన వృద్ధులు, వితంతులు ఉంటారని అంచనా.
ప్రస్తుతం 1.09లక్షల పింఛన్లు..
ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1,09,240 మందికి ప్రతీ నెల రూ. 27.86కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తుంది. వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ. 2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు నెలకు రూ. 3016 చొప్పున అందజేస్తున్నారు.
న్యూస్రీల్
మూడేళ్లుగా మంజూరు కాని కొత్త పింఛన్లు
సదరం సర్టిఫికెట్ పట్టుకొని
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అందని వైనం
వృద్ధులు, వితంతులు, నేత,
గీత కార్మికుల ఎదురుచూపు
మంజూరు చేయాలని వేడుకోలు
జిల్లాలో ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల వివరాలు
పింఛన్ రకం సంఖ్య
వృద్ధాప్యం 45,707
వితంతు 41,500
చేనేత కార్మికులు 380
గీత కార్మికులు 2,938
బోదకాలు బాధితులు 375
బీడీ కార్మికులు 14
ఒంటరి మహిళ 3014
డయాలసిస్ పేషెంట్లు 74
దివ్యాంగ 15,238
మొత్తం 1,09,240

అర్హుల నిరీక్షణ!