● ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్
కర్నూలు(హాస్పిటల్): వైద్యరంగంలో ప్రతి పరిశోధన, ప్రతి సదస్సు, ప్రతి శాసీ్త్రయ చర్చకు అంతిమ లక్ష్యం రోగికి కచ్చితమైన, అత్యుత్తమైన, అధునాతనమైన వైద్యం అందించడమేనని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఓఐ), ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 7వ వార్షిక రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఏఆర్ఓఐ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ ఎన్.సుజాత అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సతో పాటు వైద్యపరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యపరిశోధనలకు రూ.13కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో క్యాన్సర్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు.
వైద్యులు డబ్బు కోసం పరుగెత్తవద్దు
ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత, అపోలో క్యాన్సర్ సెంటర్(హైదరాబాద్) డైరెక్టర్ డాక్టర్ పి.విజయానందరెడ్డి మాట్లాడుతూ డబ్బు కోసం పరుగెత్తకూడదని..నిజాయితీగా సేవ చేస్తే డబ్బు మీ వెంట వస్తుందన్నారు. తాను 31 సంవత్సరాల వయస్సు వరకు విద్య, ప్రత్యేక వైద్య విద్యను కొనసాగించి, 32 సంవత్సరాల వయస్సులో వైద్య వృత్తిని ప్రారంభించానని తెలిపారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆలస్యం గురించి ఆలోచించకుండా, ఎంచుకున్న రంగంలో అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు. రోగులు చూపించే ప్రేమ, విశ్వాసం, గౌరవం వైద్యునికి లభించే గొప్ప సంపద అని వివరించారు. మనిషికి లభించిన జీవితాన్ని కేవలం వినోదానికి, సమయాన్ని వృఽథా చేయడానికి గాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


