కోట్లతో మొదలై పాపిరెడ్డితో ముగిసి..
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను పునర్విభజన చేసిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి పీఆర్అండ్ఆర్డీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం జీఓఎంఎస్ నెం.115 జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా పరిషత్ ఆవిర్భవించనుంది. ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24వ తేదితో ముగియనుంది. ఆ మేరకు కొత్త జిల్లా పరిధులకు అనుగుణంగా జిల్లా పరిషత్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఏర్పా టు కానున్న నంద్యాల జిల్లా పరిషత్కు సీఈఓ, డిప్యూటీ సీఈఓలను ప్రభుత్వం త్వరలోనే నియమించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలులో మొత్తం 53 మండలాలు ఉండగా.. కర్నూలు జిల్లా పరిషత్ పరిధిలోకి 25 మండలాలు, కొత్తగా ఏర్పాటు కానున్న నంద్యాల జిల్లా పరిషత్ పరిధిలోకి 28 మండల పరిషత్తులు ఉండనున్నాయి. ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం ముగిసిన అనంతరం రెండు జిల్లాల్లో ప్రత్యేకంగా పాలనా వ్యవస్థ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
● 1959లో కర్నూలు జిల్లా పరిషత్ ఏర్పాటు కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా పాలన సాగించగా, ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి చైర్మన్గా యర్రబోతుల పాపిరెడ్డి చరిత్రలో నిలిచిపోనున్నారు. కోట్ల విజయభాస్కర్రెడ్డితో పాటు యర్రబోతుల పాపిరెడ్డి వరకు మొత్తం 16 మంది చైర్మన్లు కర్నూలు జిల్లా పరిషత్ పాలనలో భాగస్వామ్యులయ్యారు.
ఈ నెల 24తో ముగియనున్న
జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీల
పదవీ కాలం
నంద్యాలలో కొత్తగా జిల్లా పరిషత్
ఏర్పాటుకు చర్యలు


