● సుమారు రూ.కోటి కొల్లగొట్టిన
సైబర్ నేరగాళ్లు!
బండిఆత్మకూరు: అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఎఫ్బీటీ యాప్ పేరుతో బండిఆత్మకూరు మండలం ఎరగ్రుంట్ల గ్రామస్తులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి దాదాపు రూ.కోటి వరకు నగదు సేకరించి మోసానికి పాల్పడినట్లు సమాచారం. తొలుత యాప్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. కొంతకాలం పాటు లాభాలు వచ్చినట్లు చూపించి బాధితుల్లో విశ్వాసం కల్పించారు. అనంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టారు. నగదును వివిధ ఖాతాలకు బదిలీ చేయించుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. యాప్లో చూపించిన నగదును విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు.
పంటలు లేవు కదా అని ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి కొంత డబ్బును తీసుకున్నా. ఐదు రూపాయల వడ్డీ ద్వారా కొంత డబ్బును తీసుకున్నా. ఎఫ్బీటీ యాప్ పేరుతో రూ. 3 లక్షలను ఫోన్ పే ద్వారా చెల్లించా. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. – కుమారి , బాధితురాలు


