డోన్ పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయునిగా పని చేస్తున్న డాక్టర్ దేవేంద్రప్ప రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ఈయన 2002 డీఎస్సీలో ఎంపికై తెలుగు ఉపాధ్యాయునిగా అవుకు మండలం కునుకుంట్ల పాఠశాలలో చేరారు. ఈయన తెలుగు భాషపై పట్టు సాధించి సాహిత్యంపై అడుగులు వేశారు. విధులు నిర్వహించే పాఠశాలల్లో విద్యార్థులకు భాషాభివృద్ధి, బాల సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడంతో పాటు నైతిక విలువలు, సృజనాత్మక, క్రమశిక్షణ విషయాలను విద్యార్థులకు బోధిస్తూ ఆదర్శంగా నిలిచారు. సాహిత్యం పట్ల మక్కువతో ఆయన ఆశావాది, ఆభ్యుదయ భావకుడు, అంబేడ్కకర్ శతకం అనే గ్రంథాలు రచించారు. అలాగే సృజనా స్రవంతి, చదువు ఎదుగు, అనిత అనే కథానికలకు సంపాదకత్వం వహించారు. రాష్ట్రంలో అనేక సాహితి సంస్థల నుంచి పురస్కారాలు, సత్కారాలను పొందారు. ఈ క్రమంలో ఆయనను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఈ పురస్కారం తనకు మరింత ప్రోత్సాహానిచ్చిందన్నారు. – డోన్ రూరల్


