కర్నూలు (టౌన్): హైకోర్టు శాశ్వత బెంచ్పై ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టీ.మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో కోర్టు విధులకు హాజరయ్యే సమయంలో ధరించే నల్లకోటుకు బదులుగా సివిల్ డ్రెస్లో కూర్చొని న్యాయవాదులు 12వ రోజు దీక్షలను కొనసాగించారు. వారు మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో హైకోర్టు శాశ్వత బెంచ్పై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంపై న్యాయవాదులుగా తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. 12వ రోజు దీక్షల్లో ఈదుల బాలాజీ రెడ్డి, మురళీక్రిష్ణ, నేతన్యా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
న్యాయవాదుల దీక్షలకు
పలువురు మద్దతు
సర్క్యూట్ బెంచ్ కాకుండా కర్నూలులో శాశ్వతంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గత 11 రోజలుగా న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలకు పలువురు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ ఆలీఖాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, లౌకిక రాజ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ నరసింహా తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈసీహెచ్ సమావేశానికి హాజరవ్వాలి
కర్నూలు(సెంట్రల్): ఈసీహెచ్ పాలీక్లినిక్ నెల వారీ సమావేశానికి ప్రతి మాజీ సైనికుడు హాజ రై విజయవంతం చేయాలని కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీసుమెన్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు యు.సుధాకర్, వెంకటేశ్వర్లు, ట్రెజరర్ మలికార్జున శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. మాజీ సైనికులకు సంబంధించి అధునాతన వైద్యం అందించడంలో ఈసీహెచ్ ఆఫీసర్ ఇన్చార్జ్ విఫలమైన నేపథ్యంలో అందరూ హాజరై హక్కుల కోసం నిలదీయా ల్సి ఉందన్నారు. ఆసుపత్రి ఎంప్యానెల్మెంట్, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు, మందుల సరఫరా, రెఫరల్స్, వైద్య సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్న నేపథ్యంలో మాజీ సైనికులు హాజరు కావాలని కోరారు.
ఇంటింటి సర్వేపై అభ్యంతరాల స్వీకరణ
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు తెలపాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ కోరారు. శుక్రవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఎస్ఈసీ ఆదేశాల మేరకు గత నెల 18 నుంచి 24వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. ఆ మేరకు గుర్తించిన ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 3 నుంచి 6వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేది వరకు గ్రామ సభలను నిర్వహించి తుది ఓటరు జాబితాలను రూపొందిస్తామన్నారు. ఈ జాబితాలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో 7వ తేదీన తుది జాబితాలను ప్రచురిస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీడీఓ ఎల్.భరత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీర్ పాల్గొన్నారు.
భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించాలి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల యాత్రకు విచ్చేసే భక్తులందరూ సంతృప్తి చెందేలా ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైల దేవస్థాన పరిపాలనాంశాలపై ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశానికి డీఈవో చంద్రశేఖర్, అన్ని యూనిట్ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఏఈలు పాల్గొన్నారు. అన్ని విభాగాలు కూడా అధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకి అనుగుణగా ఆయా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ అధికారులు శాసీ్త్రయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.


