జూపాడుబంగ్లా: కేసీ కాల్వలో నీరు ప్రవహిస్తున్నా పంటలకు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికే మొక్కజొన్న పంటను దున్నేసిన రైతులు పత్తి చేతికొస్తుందని ఆశించారు. మల్యాల ఎత్తిపోతల నుంచి ఓ మోటారు ద్వారా 338 క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు వదులుతున్నాయి. అయితే పంట కాలువలకు ఇవ్వడం లేదు. తాగునీటి అవసరాల నిమిత్తం మాత్రమే ఇస్తామని అధికారులు పేర్కొంటూ రైతుల ఆశలపై నీళ్లుచల్లారు. కళ్లెదుటే కాల్వలో నీళ్లుపారుతున్నా పంటలను కాపాడుకోలేకపోతున్నామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
25,430 ఎకరాల్లో సాగు
కేసీ కాల్వ ఆయకట్టు కింద నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, గడివేముల, బండిఆత్మకూరు మండలాల పరిధిలో 25,430 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మినుము, సోయాబీన్, కంది తదితర పంటలను సాగుచేశారు. పంటలు సాగుచేసి 50 రోజులు అవుతోంది. ఎదుగుదల లోపించడంతో 15,243 ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్, మినుము పంటలను రైతులు దున్నేవారు. ప్రస్తుతం పత్తి, కంది పంటలు మాత్రమే కొన ఊపిరితో ఉన్నాయి. వాటికి ప్రస్తుతం ఓ తడినీరు ఇస్తే ఎకరాకు కొంత దిగుబడి అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


