● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
● ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం
● విద్యుత్ దీపాల వెలుగులో
కొండారెడ్డిబురుజు
కర్నూలు: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కర్నూలులో అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు వేదికై న పోలీస్ పరేడ్ మైదానం అందంగా ముస్తాబైంది. శనివారం ఉదయం నిర్వహించే వేడుకల్లో మంత్రి టీజీ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో పాటు ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు వీలుగా షామియానాలు, కుర్చీలు తదితరాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటుకు వీలుగా పందిర్లను వేశారు. రకరకాల విద్యుత్ దీపాలు, అరటి, టెంకాయల తోరణాలతో వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పథకాలతో శకటాలను సిద్ధం చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు దేశ భక్తిని చాటుతూ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. పోలీసు పెరేడ్ ప్రదర్శన, జిల్లా ప్రగతిపై సందేశం, పోలీసు దళాల మార్చ్ఫాస్ట్, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల బహుకరణ, స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు సత్కారం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రిహార్సల్స్
దేశ భక్తి ఉట్టిపడేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. స్థానిక పెరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ను అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్ పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు.


