తుగ్గలి: ప్రాణంతో సమానంగా చూసుకునే పైరును రైతు కన్నీళ్లు దిగమింగుకొని స్వయంగా ట్రాక్టర్తో దున్నేశాడు. వర్షాభావంతో పంట చేతికందకుండా పోతుందనే ఆవేదనతో ఓ రైతు ఆముదం, కంది పైర్లను ట్రాక్టర్తో దున్నేశారు. తుగ్గలి మండలంలోని ఉప్పర్లపల్లికి చెందిన రైతు సూర్యనారాయణాచారి తనకున్న 1.15 ఎకరాల్లో రెండు నెలల క్రితం ఆముదం, కంది పంటలు సాగు చేశాడు. సేద్యపు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కూలీలకు రూ.20 వేలకు పైగా ఖర్చు పెట్టారు. తర్వాత రెండు నెలలు దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో పైర్ల ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు వర్షం కురిసినా పంట దిగుబడులు రావనే ఆవేదనతో మంగళవారం ట్రాక్టర్ గుంటెకతో పంటను దున్నేశాడు. మున్ముందు వర్షం వస్తే ప్రత్యామ్నాయ పంట ఏదైనా వేసుకునే అవకాశం ఉంటుందని పంటను దున్నేసినట్లు రైతు వాపోయాడు.


