కర్నూలు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలు పాలన మార్పు కోసమేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అన్నా రు. గురువారం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఐ నాయకులు పట్టణాలు, గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టారు. కర్నూలు నగరంలోని 19వ వార్డు గణేష్ నగర్లో పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు. 16వ తేదీన కలెక్టరేట్ ఎదుట భారీ ప్రదర్శన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు పాలనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు లేనిపోని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, నాయకులు ఆవుల శేఖర్, మునెప్ప, ప్రమీలమ్మ, మనోహర్ మాణిక్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.


