కర్నూలు(సెంట్రల్): స్కీం వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మెయిన్ గేట్ వద్ద కనీస వేతనాల కోసం ఉద్యమించిన స్కీం వర్కర్లను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్లు దూకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో పోలీసులు, స్కీం వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కనీస వేతన డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.నిర్మల మాట్లాడుతూ స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలన్నారు. వర్కర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమీజాబీ, బాలదుర్గమ్మ, శివలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


