కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సీఐలు, ఎస్ఐలు పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సైబర్ నేరాల కేసుల విషయంలో 1930కి వచ్చిన ఫిర్యాదులు, ఆన్లైన్ ఫిర్యాదులు, బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన నగదు అంశాలను పర్యవేక్షించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీఎస్ పోలీసులు పనితీరు మెరుగుపరచుకుని బృందాలుగా ఏర్పడి ప్రాపర్టీ నేరాలను ఛేదించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకటరామయ్య, రాఘవేంద్ర, దుర్గాప్రసాద్తో పాటు సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు.
నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా అందించే టెన్జింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డు–2025కు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈఓ డాక్టర్ కె.వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాలైన 2023, 2024, 2025 కాలంలో భూమి, సముద్రం, గగనతలంపై నిర్వహించిన సాహసక్రీడలు, సాహస కార్యక్రమాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన వ్యక్తులు ఈ అవార్డు దరఖాస్తుకు అర్హులన్నారు. అవార్డును అర్జున అవార్డులతో పాటు ప్రదానం చేస్తారన్నారు. అవార్డు గ్రహీతలకు టెన్జింగ్ నార్కే కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.15లక్షల నగదు బహుమతి అందజేస్తారన్నారు. ఈనెల 20లోపు httpr://awardr.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను కర్నూలు నగరం కల్లూరు ఎస్టేట్లోని సెట్కూరు కార్యాలయంలో సమర్పించాలన్నారు.


