● భారీగా తరలిరావాలని వైఎస్సార్సీపీ
యువజన విభాగం నాయకుల పిలుపు
కర్నూలు (టౌన్): డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అద్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్ సంయుక్తంగా డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఈనెల 28న కర్నూలులో నిర్వహించనున్న భారీ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున పోస్టులను అమ్ముకున్నారని, ఏనాడు క్రీడా మైదానం చూడని వారు ఉద్యోగాలు పొందారన్నారు. ఎంతో మంది అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. అప్పట్లో నిరుద్యోగ డీఎస్సీ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా చంద్రబాబు ప్రభుత్వానికి చలనం లేదన్నారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్, రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లకు సంబంధించి విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 10,700 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. నిరుద్యోగ భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో 28న చేపడుతున్న ర్యాలీకి యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పాణ్యం యువజన విభాగం అధ్యక్షుడు దుర్గప్రసాద్, జిల్లా కార్యదర్శి మధుమోహన్ రెడ్డి, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు అన్సూర్ బాషా, పాణ్యం విద్యార్థి విభాగం అద్యక్షుడు జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.


