మేం దళిత కుటుంబానికి చెందిన వారం. నా పెద్ద కుమారుడు వినోద్ గత ఏడాది గడివేముల హైస్కూల్లో పదో తరగతి చదివాడు. తల్లికి వందనం ఇవ్వలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేశాం. ఇంత వరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఈ ఏడాది ఇంటర్ చదువుతున్న నా కుమారుడికి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ప్రభుత్వం అర్హులైన వారందరికీ డబ్బులు వేయాలని వేడుకుంటున్నాను.
– వసంత, గడివేముల
నా కూతురు ప్రైవేట్ కాలేజీలో సెకండ్ ఇయర్ బైపీసీ చదివింది. గత ఏడాది జూన్ నెలలో తల్లి వందనం పథకం కింద నా బ్యాంకు ఖాతాలో రూ.6 వేలు మాత్రమే నగదు జమయింది. ఇప్పటి వరకు మిగిలిన సొమ్ము జమ కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం తల్లి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి నాకు ఆరు వేలు జమ చేసి చేసింది. జగనన్న ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా మొత్తం నగదు వచ్చింది. ప్రభుత్వం ఇపటికై నా అర్హులందరికీ తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేయాలి.
– రాధమ్మ, గంగవరం గ్రామం,
నందవరం మండలం
మా కుమారుడు 9వ తరగతి, కుమార్తె 8వ తరగతి చదువుతున్నారు. గతేడాది తల్లికి వందనం కింద ఇద్దరు బిడ్డలకు నగదు పడలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడికి కింద నగదు పడింది. మాకు మూడు ఎకరాల భూమి ఉంటే ఆన్లైన్లో ఆరు ఎకరాలు ఉందని చూపుతోంది. కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. ఒక్క రూపాయి కూడా తల్లికి వందనం జమకాలేదు. ఈ ఏడాది కూడా వస్తుందని నమ్మకం లేదు.
– కల్లూరి లక్ష్మీ, చిన్నభూంపల్లి, కోసిగి మండలం
మా కుమారుడు కార్తీక్ గతేడాది స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదివాడు. మాకు ఎటువంటి పొలాలు లేవు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గతేడాది మొదట తల్లికి వందనం డబ్బులు పడలేదు. అప్పట్లో సచివాలయం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాం. చాలా రోజులకు రూ. 8 వేలు వేశారు. మిగతా డబ్బులు మళ్లీ పడతాయని సెల్ ఫోన్లో మేసేజ్లు చూసుకుంటూ ఉన్నాం. చదువు పూర్తయినా ఇంత వరకు పడలేదు. ఈఏడాదైనా మాలాంటి పేదలకు పూర్తిగా న్యాయం చేయాలి. – సునీత, గడివేముల


