హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి గురువారం ఉదయం టీబీ బోర్డు అధికారులు దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు నీరు విడుదల చేశారు. తాగునీటి అవసరాలకు ఒకటిన్నర టీఎంసీల వరకు నీటిని వదలనున్నట్లు సమాచారం. ఆ నీరు కర్నూలుకు చేరిన తర్వాత బంద్ చేయనున్నారు. ఈ నీటితో జిల్లాలోని సమ్మర్స్టోరేజ్ ట్యాంకులు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపుకోవాల్సి ఉంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో 26 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గురువారం ఉదయం 4,814 క్యూసెక్కుల మాత్రమే ఇన్ఫ్లో ఉంది. గతేడాది ఇదే సమయానికి 80 టీఎంసీల నీరు నిల్వ ఉండి 40 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండేది. డ్యాం గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదిలే వారు. ఈ ఏడాది ఎగువ ప్రాంతంలో వర్షాలు లేక డ్యాంకు నీటి చేరిక పూర్తి పడిపోయి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.


