కేసీ కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం
కర్నూలు: కర్నూ లు మండలం పడిదెంపాడు గ్రామ పొలిమేరలో కేసీ కెనాల్లో నీటిలో కొట్టుకుపోతున్న గుర్తు తెలియని పురుష మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. కర్నూలు గడ్డా వీధికి చెందిన షేక్ ఉమర్ ఫరూక్ వ్యక్తిగత పనిమీద పడిదెంపాడు వైపు కేసీ కెనాల్పై వెళ్తుండగా నీటిపై మృతదేహం తేలినట్లు కనిపించింది. దీంతో షేక్ ఉమర్ ఫరూక్ స్పందించి మృతదేహాన్ని పక్కకు లాగి అక్కడే ఉన్న దుప్పటి సహాయంతో పక్కనున్న రాయికి కట్టి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాలూకా పీఎస్ ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీయించారు. మృతదేహం కుడిచేతిపై షేకున్ అని ఇంగ్లిషులో పచ్చబొట్టు, ఎడమ మెడ వద్ద గుండ్రని పచ్చబొట్టు ఉంది. నల్లని టీషర్టు ధరించాడు. సుమారు 28 సంవత్సరాలు వయస్సు ఉంటుంది. ఆచూకీ తెలిసినవారు తాలూకా పోలీసులను సంప్రదించి సమాచారమివ్వాలని ఎస్ఐ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు.
వివాహిత ఆత్మహత్య
బేతంచెర్ల: గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామా నికి చెందిన దూదేకుల ఇమాం సాహెబ్ కూతురు ఆశాబీ (27)కి కొన్నేళ్ల క్రితం మద్దూరుకు చెందిన కమాల్తో వివాహమైంది. కమాల్ ఇల్లరికం అల్లుడిగా వచ్చి గోర్లగుట్టలోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు కాగా రెండవ కుమారుడు ఉస్సేన్వలి నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆశాబీ తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంది. మరో కుమారుడు ఉసేన్ బాషా బేతంచెర్ల పట్టణంలో డ్యాన్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. దీంతో ప్రతి రోజు కుమారుడిని వెంట తీసుకోని పట్టణానికి వచ్చేది. ఈ క్రమంలో సోమవారం కుమారునితో డ్యాన్స్ కోచింగ్ సెంటర్ వచ్చిన ఆమె బాత్ రూంలోకి వెళ్లి రసాయన పౌడర్ నీటిలో కలుపుకుని తాగి ఆపస్మారక స్థితిలో పడి పోయింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ నబీ సంఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇమాంసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కోడుమూరు రూరల్: కోడుమూరులోని షణ్ముఖరెడ్డి నగర్కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లలోపు వయస్సు ఉన్న తన ఇద్దరు కుమారులతో పాటు కన్పించడం లేదు. పోలీసులు తెలిపిన మే రకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మార్కె ట్లో గుమస్తాగా పనిచేసే సుధాకర్ ఆదివారం తన కుమారులు భరత్కుమార్, మాన్విత్ కుమార్ ను పిలుచుకుని భార్య పుట్టినిల్లు అయిన దేవనకొండకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే సుధాకర్ దేవనకొండకు వెళ్లకపోవడంతో పాటు, కోడుమూరుకు తిరిగి రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో ఆందోళన చెందిన భార్య అనురాధ సోమవారం సాయంత్రం కోడుమూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేర కు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు.
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
పగిడ్యాల: పడమర ప్రాతకోట ఎస్సీ కాలనీలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పక్కా ఇల్లు దగ్ధమైంది. కాలనీకి చెందిన ఇస్కాల జేమ్స్ అలియాస్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా రోళ్లపాడు గ్రామంలో జరిగిన ఫంక్షన్కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఇంట్లో నుంచి పొగలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరాను బంద్ చేయించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు అదుపు కాకపోవడంతో కర్నూలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారంతో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్, రెండు బీరువాలు, టీవీ, బియ్యం, బట్టలు, ఫర్నిచర్ కాలిపోయాయి. ఆస్తి నష్టంపై తహసీల్దార్కు నివేదిక పంపుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు.


