ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.14 కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. మొత్తం 56 రోజులకు భక్తులు నగదు రూపంలో రూ.1,14,68,836 సమర్పించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్ తెలిపారు. వెండి 13 కేజీల 790 గ్రాములు, బంగారం 29 గ్రాముల 100 మిల్లీ గ్రాములు వచ్చిందన్నారు.
1000 హెక్టార్లలో
ఆయిల్పామ్ సాగు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 1000 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హెక్టారుకు ఆయిల్పామ్ మొక్కలు నాటుకోవడానికి రూ.25,250 నుంచి రూ.29 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. అధిక సాంద్రతలో మొక్కలు నాటుకుంటే రూ.29వేలు, మొక్కలు తక్కువ వచ్చే విధానంలో నాటుకుంటే రూ.25,250 సబ్సిడీ లభిస్తుందని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. కర్నూలు జిల్లాలో 500 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 500 హెక్టార్లలో సాగు చేయాలనేది లక్ష్యం. మొక్కలు కంపెనీలే సరఫరా చేస్తుండటం వల్ల సబ్సిడీలను కంపెనీలకే విడుదల చేస్తారు. నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.5,250 ప్రకారం నిర్వహణ కింద సబ్సిడీ ఇస్తారు. నాలుగేళ్ల పాటు అంతర పంటలుగా వ్యవసాయ, ఉద్యానపంటలు సాగు చేసుకోవచ్చు. అంతరపంటల సాగుకు ఏడాదికి రూ.5,250 ప్రకారం నాలుగేళ్ల పాటు సబ్సిడీ లభిస్తుందని జిల్లా ఉద్యాన అధికారి పేర్కొన్నారు.
1.06 లక్షల మందికి ఉపాధి పనులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి పనులకు డిమాండ్ పెరిగిందని, రోజుకు 1.06 లక్షల మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నామని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి టెక్నికల్ అసిస్టెంట్ తన పరిధిలోని మూడు పంచాయతీల్లో జరిగే పనులను తనిఖీ చేసి ఫొటోలను అప్లోడ్ చేయాలని ఆదేశించామన్నారు. ఏపీవో ప్రతి రోజు రెండు పంచాయతీలు, ఏపీడీలు తన పరిధిలో రోజూ 2 మండలాల్లో ఉపాధి పనులను తనిఖీ చేసి ఫొటోలు అప్లోడ్ చేస్తారన్నారు. భూగర్భ జలాలను పెంచే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి ఒక్కరికి రూ.300 నుంచి రూ.307 వేతనం లభించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.20 చెల్లించి రూ.2లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చన్నారు.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంవత్సరాల ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ కోర్సులు, ఒక సంవత్సరం మెకానికల్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9703395091, 9440748448, 08524–286055లను సంప్రదించాలన్నారు.
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.14 కోట్లు


