చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పారిశ్రామిక, వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నెల 17వ తేదీన కలెక్టరేట్లో ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నుంచి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ.. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న ఔత్సాహికులు, ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తూ వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్తలు ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్రభుత్వ సహాయం, అనుమతులు, ఇతరశాఖల నుంచి అవసరమైన సహకారం కావాల్సిన వారు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. అలాగే ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్న వారికి ఎదురవుతున్న సమస్యలు కూడా సమావేశంలో వివరించవచ్చని చెప్పారు. జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని సమస్యలను చట్టపరమైన పరిధిలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్న ఇతర ప్రాంతాల వారు ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్కు హాజరుకావాలన్నారు ఇతర సమాచారం కోసం 99890 92288 నంబర్ను సంప్రదించాలని కోరారు.


