కొండలమ్మ సన్నిధిలో జడ్జి అరుణసారిక | - | Sakshi
Sakshi News home page

కొండలమ్మ సన్నిధిలో జడ్జి అరుణసారిక

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

కొండలమ్మ సన్నిధిలో జడ్జి అరుణసారిక 27న శతాధిక వృద్ధుల సన్మానోత్సవం ఏపీకి మహిళల ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌ షిప్‌ 9న జాబ్‌ మేళా

గుడ్లవల్లేరు: వేమవరం కొండలమ్మను చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థాన కమిటీ చైర్మన్‌ ఈడె విష్ణు వెంకట మోహన్‌రావు, ఈఓ ఆకుల కొండలరావు స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందించారు.

15వ తేదీలోపు నమోదు చేసుకోవాలి

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి శతాధిక వృద్ధులు ఈ నెల 15వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ చల్లా హరికుమార్‌, వైస్‌ చైర్మన్‌ తేజ్‌రాజ్‌ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పది మంది శతాధిక వృద్ధులను ఒక్కచోట చేర్చి వారి ఆశీస్సులు తీసుకుంటే దైవం ఆశీర్వాదం తీసుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి వారికి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 93475 72766, 98481 11138 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్‌ సొంత ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేసి తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బెంగళూరులో జరిగిన 80వ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ మహిళల టీమ్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను ఏపీ సీనియర్‌ మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్‌లో తెలంగాణపై 3–1 స్కోర్‌తో ఏపీ జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఫైనల్‌లో తమిళనాడు జట్టుతో పోటీ పడి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 3–2 స్కోర్‌తో ఏపీ జట్టు విజయం సాధించింది. ఇదే చాంపియన్‌ షిప్‌లో ఏపీ జూనియర్‌ బాలుర జట్టు ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రతిభ చూపిన జట్లను ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి అభినందించారు.

పామర్రు: పామర్రు మండలం కురుమద్దాలి రూరల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌లో ఈనెల 9వ తేదీన జాబ్‌ మేళా జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 9గంటలకు జాబ్‌మేళా నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిలో బంధన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, ట్రైన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, ఎస్‌బీ లైఫ్‌ ఇన్సూరెన్సు కో లిమిటెడ్‌, కురకు పైనాన్సియల్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అడెక్కో ఇండియా పైవేట్‌ లిమిటెడ్‌, వరుణ్‌ మోటార్స్‌ పైవేట్‌ లిమిటెడ్‌, టీమ్‌ రెడ్‌ మేనేజ్మెంట్‌ పొల్యూషన్‌ పైవేట్‌ లిమిటెడ్‌ (డీబీఎస్‌ బ్యాంక్‌), పీటీఎం సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మెడ్‌ ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎల్విన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి 11కు పైగా ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని తెలిపారు. అభ్యర్థులు ముందుగా హెచ్‌టీటీపీఎస్‌://ఎన్‌ఏఐపీయుఎన్‌వైఏఎం.ఏపీ.జీవోవి.ఐఎన్‌/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో రిజిస్టర్‌ కావడంతో పాటు, జాబ్‌ మేళాకు రెజ్యూమ్‌లతో లేదా బయోడేటా ఫారమ్‌లతో పాటు, ఆధార్‌, దానికి లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌, పాన్‌, సర్టిఫికెట్ల్‌ జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96187 13243 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement