పూల మార్కెట్కు పోటెత్తిన వినియోగదారులు వరలక్ష్మీ వ్రతానికి ముందుగానే ప్రారంభమైన సందడి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని నగరంలో హోల్సేల్ పూల మార్కెట్ బుధవారం వినియోగదారులతో పోటెత్తింది. సాధారణంగా ఒకరోజు ముందుగా సందడి ఉండే మార్కెట్లో ఈ ఏడాది మాత్రం రెండు రోజుల ముందుగానే హడావుడి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని పూల ధరలు అందుబాటులో ఉన్నా మరికొన్ని ధరలు అమాంతం పెరిగిపోవడంతో నగరవాసులు బెంబేలెత్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకోవటం ఆనవాయితీ. అయితే ఈ సారి పౌర్ణమి రోజే శ్రావణ శుక్రవారం రావటంతో రెండు రోజులూ వ్రతాలను చేసుకోవటానికి మహిళలు సమయుత్తమవుతున్నారు. ఆ క్రమంలో బుధవారం మార్కెట్కు నగర వాసులు బారులు తీరారు. ముఖ్యంగా నగరంలోని రాజీవ్గాంధీ హోల్సేల్ పూల మార్కెట్లో కిలో కనకాంబరాలు రూ.1500 పలకగా రెండు రోజుల క్రితం అవే పూలు రూ.400 మాత్రమే పలికాయి. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని కనకాంబరాలు ధర మూడింతలై కూర్చుంది. అదే క్రమంలో మల్లెపూలు మంగళవారం రూ.200 నుంచి రూ.300 పలకగా బుధవారం వెయ్యి నుంచి రూ.1200కు పెరిగింది. అదేవిధంగా సన్నజాజులు కూడా రూ.400 నుంచి రూ.1200 పెరిగాయి. అలాగే చామంతి, గులాబీ 400 నుంచి రూ.600కు విక్రయించారు. బంతిపూలు రూ.400, హైబ్రీడ్ గులాబీ వంద రెండొందల చొప్పున విక్రయించారు. వాటితో పాటుగా బెంగుళూరు నుంచి వచ్చే గులాబీ 20 పూల కట్ట రూ.200కు విక్రయించారు. అదేవిధంగా దండల ధరలు సైతం అమాంతం పైకెక్కి కూర్చున్నాయి.


