లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూనియర్ వైద్యులు శనివారం తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించారు. తొలుత జీజీహెచ్, వైద్య కళాశాలల్లో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో జూడాలు పాల్గొన్నారు. అనంతరం రిలే దీక్షా శిబిరానికి చేరుకుని శాంతియుతంగా దీక్షలు చేపట్టారు. తమ స్టైపెండ్ పెంచడంతో పాటు, మరిన్ని సమస్యల పరిష్కారం కోరుతూ ఆరు రోజులుగా జూడాలు సాధారణ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూడాలు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజు కూడా కొనసాగాయి. ప్రభుత్వం శనివారం సాయంత్రం 5 గంటల లోపు తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు అల్టిమేటం జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. దీంతో జూడాలు సోమవారం నుంచి అత్యవసర సేవలు సైతం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్స్కు నోటీసులు అందజేశారు.


