నేడు ఐలా ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడు ఐలా ఎన్నికలు

Aug 13 2026 1:51 AM | Updated on Aug 13 2026 1:51 AM

నేడు ఐలా ఎన్నికలు ఆటోనగర్‌(విజయవాడతూర్పు): ఐలా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల అధికారి దొరబాబు బుధవారం తెలిపారు. మొత్తం 1,183 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలను వెళ్లడిస్తామన్నారు. ఒక ఓటరు రెండు ప్యానళ్లలో నచ్చిన అభ్యర్థులకు ఆరు ఓట్లు వేయాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను 50 సిబ్బందితో పాటు పోలీసులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఏటీఏ బలపరిచిన చైర్మన్‌ అభ్యర్థి ఎండీ ఇర్ఫాన్‌ ప్యానల్‌కు బ్యాలెట్‌లో ఒకటో నబరు, రెండో ప్యానల్‌ చైర్మన్‌ అభ్యర్థి అన్నె శివ నాగేశ్వరరావుకు బ్యాలెట్‌లో రెండో నంబరు కేటాయించినట్టువివరించారు. ఈ నంబర్లను లాటరీ ద్వారా తీసినట్టు తెలిపారు. కరువు మండలాలను ప్రకటించాలి కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థి తుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్‌ చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, పేదలను ఆదుకోవాలని కోరారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా అర్హులైన కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులను గుర్తించాలని కోరారు. పంట వేసినా, వేయకుండా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం అందించాలని, దేవదాయ భూముల కౌలు రైతుల కౌలును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సన్న, చిన్నకారు, మధ్యతరగతి, కౌలు, రైతుమిత్ర, జేఎల్‌జీ గ్రూపుల రుణాలను రద్దు చేయాలని, కౌలు రైతులకు, కరువు బాధితులకు నెలకు రూ.10వేలు పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.బలరామ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానం ప్రకారం పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త చట్టం తీసుకురావా లని, వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల పేర్లనే ఈ–క్రాప్‌లో నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. రంగారావు పాల్గొన్నారు. వృద్ధుడి అనుమానాస్పద మృతి

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): అనుమానాస్పదంగా ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సింగ్‌నగర్‌ లూనాసెంటర్‌ ప్రాంతానికి చెందిన అరటికాయల త్యాగరాజు(70) కుటుంబ సభ్యులు మొత్తం తీర్థయాత్రలకు తమిళనాడు వెళ్లారు. త్యాగరాజు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. ఈ నెల ఐదో తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన గాయాలతో తిరిగి వచ్చాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement